మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలె పార్లమెంటు సమావేశాలు ముగియగా.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీంతో ఈ 5 ఏళ్ల కాలానికి లోక్సభ సమావేశాలు ముగిశాయి. అంటే 17 వ లోక్సభ చివరిగా మొన్నటికే వాయిదా పడింది. ఈ క్రమంలోనే లోక్సభ సెక్రటేరియట్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ 17 వ లోక్సభకు ఎన్నికైన వారిలో 9 మంది ఎంపీలు.. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా లోక్సభలో మాట్లాడలేదని పేర్కొంది. ఆ 9 మంది ఎంపీలు ఎలాంటి చర్చలో పాల్గొనలేదని తెలిపింది.
17 వ లోక్సభ సమావేశాలు ఈ నెల 10 వ తేదీన నిరవధిక వాయిదా పడ్డాయి. అంటే మళ్లీ లోక్సభకు ఎన్నికలు జరిగి కొత్త ఎంపీలు ఎన్నిక అయిన తర్వాత 18 వ లోక్సభ కొలువుదీరనుంది. ఎన్నికలకు కొన్ని రోజుల సమయం ఉన్నా.. పార్లమెంటు సమావేశాలు మాత్రం ముగిశాయి. అయితే గత 5 ఏళ్ల కాలంలో లోక్సభలో 9 మంది ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పలేదని తాజాగా లోక్సభ సచివాలం తెలిపింది. ఇక ఆ 9 మంది ఎంపీల్లో బాలీవుడ్ స్టార్లు సన్నీ డియోల్, శత్రుఘ్న సిన్హా ఉన్నారు. సన్నీ డియోల్ తొలిసారిగా గురుదాస్పూర్ నుంచి ఎన్నికయ్యారు. అయితే గత ఐదేళ్లలో సన్నీ డియోల్ కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వగా.. ఇక శత్రుఘ్న సిన్హా మాత్రం ఆ మాత్రం కూడా చేయలేదని లోక్సభ సెక్రటేరియట్ వెల్లడించింది.
2019 లో 17 వ లోక్సభ కొలువుదీరగా.. తొలి సమావేశాలు జూన్ 17 వ తేదీన ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఉన్న మొత్తం 543 ఎంపీలలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎటువంటి చర్చలో పాల్గొననివారి సంఖ్య 9 మంది కాగా.. అందులో ఆరుగురు ఎంపీలు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. మిగిలిన వారిలో ఇద్దరు తృణముల్ కాంగ్రెస్ మరొకరు బీఎస్పీ ఎంపీ ఉన్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శత్రుఘ్న సిన్హాతోపాటు దిబ్యేందు అధికారి.. బీఎస్పీ నుంచి ఎంపీ అతుల్ కుమార్ సింగ్ లోక్సభ 5 ఏళ్ల కాలంలో మాట్లాడలేదు. ఇక బీజేపీ నుంచి సన్నీ డియోల్తోపాటు రమేశ్ చందప్ప జిగజినాడి, బీఎన్ బచేగౌడ, ప్రధాన్ బారువా, అనంత్ కుమార్ హెగ్డే, వీ శ్రీనివాస్ ప్రసాద్ ఉన్నారు. 2022 ఏప్రిల్ 16 వ తేదీన జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేసిన శత్రుఘ్న సిన్హా విజయం సాధించి లోక్సభలో అడుగు పెట్టారు. లోక్సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో సన్నీ డియోల్ ఒక్కసారి కూడా పాల్గొనకపోవడం గమనార్హం. అయితే సభలో మాట్లాడాలని స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సన్నీ డియోల్ను కోరినా ఆయన నోరు విప్పలేదని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa