మూత్రం అంటేనే మనం అందరం ఒక రకంగా చూస్తాం. అది మన శరీరం నుంచే వచ్చినా.. దాన్ని మాత్రం ఏదో వింత లాగా పరిగణిస్తాం. అయితే అదే మూత్రం ఇప్పుడు మనకు వెలుగులను ఇవ్వనుంది. అదేంటీ మూత్రం వెలుగులు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా. అదే మ్యాజిక్ మరి. మూత్రం నుంచి కరెంట్ తయారు చేసే విధానాన్ని ఐఐటీ పరిశోధకులు కనిపెట్టారు. మూత్రం నుంచి విద్యుత్తోపాటు జీవ ఎరువును ఉత్పత్తి చేయవచ్చని నిరూపించారు. పునరుత్పాదక ఇంధనాలకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు తోడు ఉన్న సహజ వనరులు అడుగంటిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు కావాల్సిన ఇంధనాన్ని సమకూర్చేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇది ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.
కేరళలోని ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. మానవ మూత్రం నుంచి విద్యుత్తు, జీవ ఎరువును ఉత్పత్తి చేసే వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారు చేయడం గమనార్హం. ఇందులో ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్, అమోనియా అధిశోషణ సాధనం, క్లోరినేషన్ గది వంటివి భాగాలుగా ఉంటాయి.
ఈఆర్ఆర్ఆర్లో మెగ్నీషియం ఆనోడ్గా, గాలిలోని కార్బన్ క్యాథోడ్గా పనిచేస్తాయి. ఈ టెక్నాలజీ.. మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రో కెమికల్ చర్యలను ప్రేరేపిస్తుంది. దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత అదే మూత్రం నుంచి నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉన్న జీవ ఎరువును కూడా ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు తయారు చేశారు. ఈ విధానంలో ఉత్పత్తి అయిన విద్యుత్త్ను మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునేందుకు.. ఎల్ఈడీ బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు వారు వెల్లడించారు.
ఐఐటీ పాలక్కడ్ రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత.. ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీలతో కూడిన టీమ్ ఈ సరికొత్త పరిశోధనను నిర్వహించింది. థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో ఈ ఈఆర్ఆర్ఆర్ రియాక్టర్లను ఉపయోగించి.. అధికంగా కరెంట్ను ఉత్పత్తి చేసి అక్కడే ఎలక్ట్రిక్ బల్బులను వెలిగించి.. తద్వారా కరెంట్ వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగ దశలో ఉందని ఐఐటీ పాలక్కడ్ బృందం స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి.. మరింత విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా మూత్రం నుంచి కరెంట్, జీవ ఎరువు తయారు చేసే టెక్నాలజీపై పేటెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేయడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa