నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు.వేమిరెడ్డితో పాటు ఆయన భార్య, టీటీడీ సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి సైతం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు.
మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని వైఎస్ జగన్ గతంలో నిర్ణయించారు. ఈ మేరకు టికెట్ కూడా ఖరారు చేశారు. అయితే తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరుతూ రాగా.. అందుకు అధిష్టానం అంగీకరించలేదు. అలాగే తన భార్య వేమిరెడ్డి ప్రశాంతికి సీటు ఇవ్వాలని కోరుతున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని తెలిసింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో ఆయన అనుచరుడు ఖలీల్ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ నిర్ణయం కూడా వేమిరెడ్డి అసంతృప్తికి కారణమని సమాచారం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న తనకు పార్టీలో కనీస గౌరవం దక్కలేదని ఆయన అనుచరుల వద్ద చెబుతూ వచ్చారట. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ బుధవారం వైసీపీ పార్టీకీ వేమిరెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. ఏ పార్టీలో చేరతారనే విషయమై ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మాజీ మంత్రి నారాయణతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి టీడీపీ తరుఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రశాంతికి కూడా అసెంబ్లీ సీటు కేటాయిస్తారని సమాచారం.
మరోవైపు నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇప్పటికే కీలక నేతలు చాలా మంది పార్టీని వీడారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీని వీడటంతో వైసీపీ శ్రేణులు గందరగోళానికి గురౌతున్నాయి. ఇదే సమయంలో మరో కీలకనేత ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa