ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల అనంతరం విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తానని తెలిపారు. మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని.. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. వైజాగ్ రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సులో సీఎం పాల్గొనగా.. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. విశాఖ అభివృద్ధి బాగా చెందుతోందని.. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని గుర్తు చేసుకున్నారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఏపీ సీఎం. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించిందని.. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందన్నారు. అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని.. అలాగే రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారాయన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయన్నారు.
ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని.. డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నామన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది.. ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామన్నారు.
బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని.. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని.. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి.. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందన్నారు. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలని.. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తామన్నారు.
ఎన్నికల తర్వాతే విశాఖలోనే ఉంటానని.. నగరంలో దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తామన్నారు.. విశాఖ విషయంలో తనకు ఉన్న కమిట్మెంట్ ఇది అన్నారు. విశాఖ రాబోయే రోజుల్లో విశ్వనగరంగా మారుతుందని.. పరిపాలనా రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైజాగ్లో ఉంటే విశాఖ బాగా అభివృద్ధి చెందుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa