ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 ఏళ్లకే రూ.4000 పింఛన్.. బీసీ డిక్లరేషన్‌లో వరాల జల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 08:31 PM

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ, జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో డిక్లరేషన్ రిలీజ్ చేశారు. పది పాయింట్లతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చిన టీడీపీ, జనసేన.. తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అలాగే పింఛన్ మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెళ్లికానుక, చంద్రన్న బీమా మొత్తాన్ని పెంచి ఆ పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు.


ఇందులో బీసీల అభ్యున్నతే ప్రధానంగా హామీలు ఇచ్చారు. పది ముఖ్యమైన పాయింట్లతో బీసీల డిక్లరేషన్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే వెనుకబడిన కులాలవారికి 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించారు. అలాగే బీసీల అభివృద్ధి కోసం ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ కింద రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు.. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ..


ఇదే సమయంలో ఐదువేల కోట్లతో ఆదరణ పేరిట పనుముట్లు, పరికరాలు పంపిణీ చేస్తామని టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. చట్టబద్ధంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జయహో బీసీ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు పిల్లలు దాటితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆ చట్టానికి సవరణ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.


బీసీలకు పెళ్లి కానుక కింద ఇచ్చే మొత్తాన్ని రూ.లక్ష పెంచుతామని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరిస్తామని.. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామని. దామాషా ప్రకారం నిధుల కేటాయిస్తామని బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటుతో సహా స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రహామీ ఇచ్చారు. అలాగే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామనీ, గురుకులాలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని బీసీ డిక్లరేషన్‌లో టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయి. అలాగే ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ, జనసేన ప్రకటించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa