ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు.
గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారని.. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారన్నారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను అన్నారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వ్యక్తి గతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదని.. కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు.
రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్సీపీ చేసే అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారంటున్నారు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు రాసిన లేఖకు డీజీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa