ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సీటులో పెద్దాయనకు లైన్ క్లియర్.. హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న టీడీపీ, జనసేనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 08:39 PM

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల మధ్య పోటీచేసే సీట్లపై అవగాహన వచ్చింది.. ఇప్పటికే 99 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ సీటుపై మాత్రం గందరగోళం కొనసాగింది. అక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఇటు జనసేన పార్టీ ముఖ్య నేత కందుల దుర్గేష్ కూడా ఆ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ సీటు కేటాయింపుపై కొంతమేర కన్ఫ్యూజన్ కొనసాగింది.


బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్‌లు రాజమండ్రి రూరల్ సీటు కోసం పట్టుబట్టడంతో అధినేతలకు తలనొప్పిగా మారింది. ఒకానొక దశలో కందుల దుర్గేష్‌కు సీటు కేటాయించారని ప్రచారం జరగింది.. గోరంట్లు బుచ్చయ్య చౌదరి మాత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేది తానేని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కందుల దుర్గేష్‌ను పిలిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ నియోజకవర్గం బదులు ప్రత్యామ్నాయంగా మరో చోట పోటీ చేయాలని సూచించారు.. కొంతకాలంగా దుర్గేష్ కేడర్‌తో మాట్లాడుతున్నారు.. చివరికి రాజమండ్రి రూరల్ కాకుండా నిడదవోలు నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ధర్మంలో భాగంగా అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి ముందుకెళ్లనున్నట్లు కందుల దుర్గేష్‌ పిలుపునిచ్చారు. వీరవరంలో ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని భావోద్వేగంతో మాట్లాడారు. సామాజిక సేవలతో ఈ ప్రాంత యువత చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని అన్నారు. తన వెన్నంటే ఉంటూ రాజకీయ ఎదుగుదలకు ఊతమిచ్చిన కేడర్‌కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలనను గద్దె దింపేందుకు మైత్రీ విజయవంతం కావాలన్నారు.


ఇటీవల నిర్వహించిన మహా పాదయాత్ర, మౌనదీక్షలు తన మనసును హత్తుకున్నాయని అన్నారు. రెండు, మూడు రోజుల్లో అధిష్ఠానం నిడదవోలు నుంచి పోటీ చేయాలన్న ప్రకటన జారీ చేయనుందని.. ప్రతి ఒక్కరి మద్దతు కావాలని కోరారు. నిడదవోలు సీటుపై పోటీ చేయాలన్న అధిష్ఠాన నిర్ణయంపై కట్టుబడి ఉన్నానని అన్నారు. వ్యూహ, ప్రతివ్యూహాలను పార్టీ పెద్దలకు వదిలి ఎన్నికల బరిలో దిగనున్నానని ఉద్వేగానికి గురయ్యారు. జనసైనికులంతా కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గోరంట్లు బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో లైన్ క్లియర్ అయ్యింది.. దుర్గేష్ నిడదవోలు నుంచి బరిలోకి దిగనున్నారు. పెద్దాయన బుచ్చయ్యకు అధికారికంగా సీటు ప్రకటించడమే తరువాయి అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బుజ్జగింపులతో దుర్గేష్ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa