సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. చాలా ఆసక్తికరమైన అంశాలు, వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కారంగా సమయానికి అవసరమైన సమాచారంతో నెటిజన్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బెంగళూరులో ఏర్పడిన నీటి కొరత.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో బెంగళూరు వాసులు తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. వారానికోసారి స్నానాలు చేస్తున్నామని.. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆనంద్ మహీంద్రా.. బెంగళూరు నగరవాసులకు ఒక చక్కటి పరిష్కారాన్ని సూచించారు. వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి వాటిని తిరిగి ఉపయోగించుకునేలా ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు.
ప్రస్తుతం వేసవి కాలం రావడంతో ఇళ్లు, ఆఫీస్లు, ఇతర భవనాల్లో సాధారణంగానే ఏసీల వినియోగం భారీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ఏసీల నుంచి బయటికి వచ్చే నీరు మొత్తం వృథాగానే పోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ నీటిని పట్టుకుని తిరిగి వినియోగించుకోవాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ నేపథ్యంలో ఏసీ నీటిని పట్టుకుని తిరిగి వాడుకునేలా ఉన్న ఓ వీడియోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న నీటి కొరత సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఐడియాలే ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఏసీ మెషీన్ నుంచి బయటికి వచ్చే నీటిని మొత్తాన్ని ఓ పైప్లోకి నిండేలా ఏర్పాటు చేసినట్లు ఉన్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ పైపు చివరి భాగంలో ఒక చిన్న ట్యాప్ బిగించారు. ప్రస్తుతం బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఏర్పడిన వేళ.. నగరవాసులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. నీటి కొరతగా ఉన్న సమయంలో ఏసీ నీటిని సులభంగా సేకరించవచ్చని.. ఇది చాలా స్మార్ట్ పద్దతి అని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల 100 లీటర్ల ఏసీ నీటిని పైపులో నిల్వ చేసుకోవచ్చని.. ఈ నీటిని మనం తాగడానికి మినహా ఇతర అనేక రకాలుగా వాడుకోవచ్చని తెలిపారు. నీరు సంపద లాంటిదని.. సురక్షితంగా నిల్వ చేసుకోవాలని ఆనంద్ మహీంద్రా సూచించారు.
ఇంటిని శుభ్రం చేసుకోవడానికి.. గార్డెన్లో చెట్లకు నీరు పోయడానికి, కార్లు కడగడానికి, బాత్రూమ్లలో ఫ్లషింగ్ కోసం ఆ నీటిని ఉపయోగించుకోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నీరు ఆదా అవడమే కాకుండా.. డిమాండ్ తగ్గుతుందని సూచిస్తున్నారు. అయితే ఇది కేవలం బెంగళూరు నగరంలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవాలని.. దీంతో అక్కడ నీటి కొరత రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. వేసవి కాలం సందర్భంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే దొరికిన ప్రతీ చోట నీటి చుక్కను కూడా ఒడిసి పట్టుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa