ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో చిన్నారి లక్షితను చంపిన చిరుత గుర్తింపు.. టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 07:18 PM

తిరుమలకు వెళ్లే దారిలో.. అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఘటన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరగ్గా.. అలిపిరి నడకమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. టీటీడీ, అటవీశాఖ అధికారులతో కలిసి అలిపిరి నడక మార్గంలో బంధించిన నాలుగో చిరుత లక్షితపై దాడి చేసి చంపినట్లు గుర్తించారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి మొత్తం ఆరు చిరుతలను బంధించిన సంగతి తెలిసిందే. అయితే లక్షితపై దాడి చేసి చంపిన ఈ చిరుతను జూ పార్కులోనే సంరక్షించాలని టీటీడీ నిర్ణయించింది.


గతేడాది ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో బయల్దేరారు. రాత్రి 7.30 గంటల సమయంలో దినేష్ శశికళ దంపతుల కుమార్తె లక్షిత.. అలిపిరి నడక మార్గంలోని లక్ష్మినరసింహ స్వామి ఆలయం దగ్గర రాగానే కనిపించలేదు. ఆమెను అడవిలోని జంతువులు లాక్కెళ్లాయని అర్థంకావడంతో వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు గాలింపు చేపట్టారు.


ఆగస్టు 12న ఉదయం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సమీపంలో చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి చిరుత దాడి చేసి చంపినట్లు గుర్తించారు. వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. చిరుతల్ని బంధించేందుకు అలిపిరి నడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆరు చిరుతులు బోనులో చిక్కాయి.. ఇలా చిక్కిన వాటిలో నాలుగో చిరుత లక్షితను చంపినట్లు గుర్తించారు. ఆ చిరుత గతేడాది ఆగస్టు 27 బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఉంది.. ఆగస్టు 28న చిరుత బోనుకు చిక్కిన విషయాన్ని గుర్తించారు అటవీశాఖ అధికారులు.


లక్షిత ఘటన తర్వాత అలిపిరి నడక మార్గంలో కొన్ని నిబంధనల్న అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్లలలోపు పిల్లల్ని నడక మార్గాల్లో అనుమతించడం లేదు.. అలాగే పెద్దవాళ్లను కూడా రాత్రి 10 గంటల తర్వాత అనుమతించరు. కొద్దిరోజులు ఘాట్ రోడ్లలో కూడా బైక్‌లపై వెళ్లేవారిని అనుమతించలేదు.. ఆ తర్వాత ఆ నిబంధనను సడలించారు. అంతేకాదు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు టీటీడీ చేతి కర్రల్ని అందిస్తోంది. ఇటు నడక మార్గంలో కంచె ఏర్పాటు చేసే అంశంపైనా ఫోకస్ పెట్టారు.. ఇప్పటికే నిపుణల కమిటీ కూడా పరిశీలన చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa