ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది..? ఆంధ్రాకు కాబోయే సీఎం ఎవరు..? జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారా..? లేదంటే కూటమి గెలిచి చంద్రబాబు సీఎం పగ్గాలు చేపడతారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ బరిలోకి దిగుతుండగా.. మరోవైపు అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటం.. మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలే అధికంగా ఉండటంతో.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏపీలోనూ గెలుస్తామనే ధీమాతో ఉంది. వైఎస్సార్సీపీ పాలన పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని కూటమి భావిస్తోంది. కాగా సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తానే.. తాము చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని జగన్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది.
ఈ నేపథ్యంలోనే బోలెడన్ని సర్వే సంస్థలు ఏపీ ఎన్నికల గురించి సర్వే చేసే.. ఫలితాలను అంచనాలు వేస్తున్నాయి. జన్మత్ పోల్స్ అనే సంస్థ సైతం ఏపీలో ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉందంటూ ఓ ట్వీట్ చేసింది. జన్మత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీకి 120-123 సీట్లు వస్తాయని.. టీడీపీ కూటమికి 46-48 సీట్లు వస్తాయని జన్మత్ అంచనా వేసింది.
ఇదే సంస్థ ఫిబ్రవరి 4న వెల్లడించిన ప్రీపోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 107-110 సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 57-59 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే టీడీపీ, జనసేనతో బీజేపీ చేరడం వల్ల కూటమికి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిందన్న అంచనాలను ఈ సంస్థ వెలువరించింది.
గతంలోనూ లోక్మత్ సర్వే ఫలితాలను వెల్లడించింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో లోక్మత్ అంచనాలు నిజమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్ మత్ అంచనా వేసింది. అయితే లోక్మత్ అంచనాలకు మించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంది.
కర్ణాటకలో కాంగ్రెస్కు 116-118 సీట్లు, బీజేపీకి 79-81, జేడీఎస్కు 20-22 సీట్లు వస్తాయని, ఇతరులకు 4-6 సీట్లు వస్తాయని 2023, మే 8న లోక్మత్ అంచనా వేసింది. మే 13న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్కు 135 సీట్లు రాగా.. బీజేపీకి 66, జేడీఎస్కు 19 సీట్లు వచ్చాయి. ఇతరులకు 4 సీట్లు వచ్చాయి.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58-60 సీట్లు వస్తాయని.. బీఆర్ఎస్ 49-51 సీట్లకు పరిమితం అవుతుందని.. బీజేపీకి 4-5 సీట్లు వస్తాయని.. ఎంఐఎంకు 6-7 సీట్లొస్తాయని జన్మత్ పోల్స్ 2023 నవంబర్ 29న అంచనా వేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64 సీట్లు రాగా.. బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీ 8 స్థానాల్లో గెలవగా.. ఎంఐఎం 7 చోట్ల గెలుపొందింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజులకుపైగా సమయం ఉంది. ఈలోగా సర్వే సంస్థలు మరిన్ని ప్రీపోల్స్ను వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ ప్రీపోల్స్ నిజం అవుతాయా..? లేదంటే జనం గుంభనంగా ఉండి తమదైన శైలిలో ఎవరికీ అంతుచిక్కని రీతిలో తీర్పును వెల్లడిస్తారా..? అనేది జూన్ 4న తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa