నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా, విపక్షనేతగా సుధీర్ఘ కాలం పనిచేసిన నేత. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేత. ఇక 2024 ఏపీ ఎన్నికలు టీడీపీకి చాలా కీలకం. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఐదేళ్లూ పార్టీని నడిపించుకుని వచ్చిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగినట్లుగానే పొత్తులు, సీట్ల సర్దబాటు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికలో ఈసారి మరింత వ్యూహత్మకంగా వ్యవహరించారు చంద్రబాబు. సర్వేలు, సామాజికవర్గాల ప్రాతిపదికన సీట్లు కేటాయించారు. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ కీలక నేతలు, మాజీ మంత్రులకు సైతం సీట్లు గల్లంతయ్యాయి. జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా కూడా కొంతమందికి సీట్లు కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సీట్లు దక్కని నేతల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టికెట్ దక్కని పలువురు సీనియర్ నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ బాధ్యతలు అప్పగించారు.
కొవ్వూరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అలాగే రెడ్డి సుబ్రమణ్యంను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. గండి బాబ్జీని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ రాముడు, టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్, మన్నె సుబ్బారెడ్డిని చంద్రబాబు నియమించారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్ కొవ్వూరు టికెట్ ఆశించగా.. ఈసారి ఆయనకు నిరాశ ఎదురైంది. ఆ స్థానంలో ముప్పిడి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జవహర్ ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు సిద్ధపడగా.. టీడీపీ అధిష్టానం ఆయన్ని సముదాయించింది. అలాగే రెడ్డి సుబ్రమణ్యం రామచంద్రాపురం టికెట్ ఆశించారు. అయితే ఆయనకు కూడా నిరాశే ఎదురైంది. గండి బాబ్జీ విశాఖ దక్షిణం టికెట్ ఆశించగా.. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లింది. దీంతో ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత వాపస్ తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa