ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ భారీ విరాళం.. అన్నయ్య చేతుల మీదుగా అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 07:48 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. మార్చి 30 వ తేదీ నుంచి పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు జనసేన అధినేత. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని అందించారు. సినిమాల ద్వారా సంపాందించిన రూ.10 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా అందించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచీ తన స్వార్జితాన్ని వెచ్చిస్తూ వస్తున్న జనసేనాని.. ఇప్పుడు మరోసారి సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బులో 10 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి‌.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.


ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పదని అన్నారు. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి నా వంతుగా ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


మరోవైపు తన విరాళం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్న పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ.వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని అభినందించారు. ఓ బేల్దారి మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారని గుర్తు చేశారు. పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో జనసేన కోసం విరాళాలు అందిస్తున్నారన్న జనసేనాని.. సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఈ డబ్బు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.


ఇక పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్.. పిఠాపురం వాసులకు ఆరు గ్యారంటీలు సైతం ప్రకటించారు. తాను గెలిస్తే పిఠాపురాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. పిఠాపురానికి ఇది నా వాగ్దానం.. గెలిపించుకోవడం మీ బాధ్యత అంటూ మార్చి 30 నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారపర్వం మొదలెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa