ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త. ఇక నుంచి విశాఖ ఎయిర్ పోర్టులో 24 గంటలూ విమాన సర్వీసులు నడవనున్నాయి. విశాఖ విమానాశ్రయంలో చేపట్టిన రీసర్ఫేసింగ్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. నౌకాదళం గతేడాది నవంబర్లో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రీసర్ఫేసింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టింది. అయితే ఇటీవలే ఆ పనులు పూర్తికావటంతో ఇక నుంచి 24 గంటలూ విమానసర్వీసులు నడిచేందుకు వీలు కలగనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విశాఖ ఎయిర్ పోర్టు 24 గంటలూ అందుబాటులోకి రానున్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు విశాఖ విమానాశ్రయంలో పది సంవత్సరాలకు ఒకసారి ఈ రీసర్ఫేసింగ్ పనులు చేపడతారు. ఈ క్రమంలోనే 2023లో రీసర్ఫేసింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 15న పనులు ప్రారంభించగా.. 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టు రన్ వేను రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఎనిమిదింటి వరకూ మూసివేసి ఉంచేవారు. దీంతో రాత్రిపూట విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫలితంగా విశాఖ సింగపూర్ మధ్య నడిచే సర్వీసుతో పాటు.. సుమారు పది వరకూ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు పనులు పూర్తికావటంతో ఇప్పుడు విశాఖ ఎయిర్ పోర్టు 24 గంటలూ అందుబాటులోకి రానుంది. దీంతో రాత్రివేళల్లోనూ విమాన సర్వీసులు నడిచే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa