ఎమ్మెల్యే పేర్ని నాని పాలనా వైఫల్యం వల్లే మచిలీపట్నం నగరంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీడీపీ-జనసేన-బీజేపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మచిలీపట్నం 4వ డివిజన్లో బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్య క్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణతో కలిసి ఆయన ఇంటింటికీ పర్యటించారు. జడ్పీ సెంటర్లో ఆయనకు ప్రజలు తాగు నీటి సమస్యను వివరించారు. వీధుల చివర ఉండే ప్రాంతాల్లో ఇళ్లకు కుళాయిల్లో తాగునీరు సరిగా అందడంలేదని, తాగునీరు కొనాల్సి వస్తోందని తెలిపారు. కుళాయిల్లో రంగుమారిన నీరు వస్తోందని ఆయనకు వివరించారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద జలాశయాల్లో నీటిమట్టం తక్కువగా ఉంటే ట్యాంకర్లతో రాత్రిపూట వైసీపీ నాయకులు నీరు అమ్ముకుంటున్నారని రవీంద్ర ఆరోపించారు. కాలువల్లోకి మళ్లీ నీరొచ్చేదాకా రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. పట్టిసీమ జలాలను సద్వినియోగం చేసుకుంటే తాగునీటి సమస్య, సాగునీటి సమస్య వచ్చేది కాదన్నారు. వైసీపీకి ఎక్కడికి వెళ్లినా వ్యతిరేకత కనబడుతోందని, ఇదే ఉమ్మడి అభ్యర్థి రవీంద్ర విజయానికి సంకేతమని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ అన్నారు. జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, చిన్నం సురేష్, పీవీ ఫణికుమార్, కరెడ్ల సుశీల, కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి రవీంద్ర ఇసుక తట్టలు మోశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa