ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 41ఏ నోటీసుపై కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశాక ముందస్తు బెయిలు పిటిషన్కు విచారణార్హత ఉండదని చెప్పడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. 41ఏ నోటీసు ఇచ్చినా.. అరెస్టు ఆందోళన ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లను విచారణ చేయకుండా కోర్టులు తోసిపుచ్చడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు ‘రామప్ప’ కేసులో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కీలక ఉత్తర్వులిచ్చారు.
కొంతమంది ఫేస్బుక్ నకిలీ ఐడీలతో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను అపకీర్తి పాలు చేయడంతోపాటు దూషిస్తూ పోస్టులు పెట్టారని వి.రవీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విశాఖపట్నానికి చెందిన పినపల ఉదయ్భూషణ్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలని పిటిషనర్కు 41ఏ నోటీసు ఇచ్చామని ఏపీపీ వాదనలు వినిపించారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు.
విశాఖపట్నంలో ఉన్న పిటిషనర్కు పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నా.. వేధించాలన్న ఉద్దేశంతో పులివెందుల ఠాణాకు తీసుకెళ్లి, అక్కడ నిర్బంధించారని పిటిషనర్ తరఫున లాయర్ పీవీజీ ఉమేశ్చంద్ర వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడు వి.రవీంద్రారెడ్డి పిటిషనర్ను హతమారుస్తామని పోలీస్ స్టేషన్లో బెదిరించారన్నారు. అందుకే పిటిషనర్ పులివెందుల పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కాలేరన్నారు. 41ఏ నోటీసు ఇచ్చినప్పటికీ.. అరెస్టు గురించి ఆందోళన ఉందన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పిటిషనర్కు న్యాయమూర్తి షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa