ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి ఎన్నికల సంఘం షాక్.. మంత్రితో పాటూ ఎమ్మెల్సీకి 48 గంటల డెడ్‌లైన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2024, 10:03 PM

టీడీపీ అధినేత చంద్రబాబుపై అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులకు సంబంధించి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రి జోగి రమేశ్‌, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డికి గురువారం వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు స్పందించక పోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి నివేదిక పంపుతామని హెచ్చరించారు.


పింఛన్ల విషయంలో చంద్రబాబుపై జోగి రమేశ్‌ చేసిన ఆరోపణలతో పాటు అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో తప్పుడు పోస్టులు పెట్టారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ రెండు ఘటనల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ ఈసీ ఇచ్చిన పత్రికా ప్రకటనలోని 47వ పేరాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడి, నిరాధార ఆరోపణలు చేయడాన్ని పూర్తిగా నిషేధించింది.


వర్ల రామయ్య సమర్పించిన ఆధారాలు, వీడియోల్లో ప్రవర్తనా నియమావళిని మీరు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది అని జోగి రమేశ్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో చంద్రబాబుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అభ్యంతరకర పోస్టులు ఉంచారని ఈ నెల 1న వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వీటిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే. ఆయన సమర్పించిన ఆధారాలను బట్టి ఇదే విషయం స్పష్టమవుతోంది అని అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.


మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు రామయ్య. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటోలు వేసి వాళ్లు పేదల వ్యతిరేకులు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వైఎస్సార్2సీపీ నేతలు సిగ్గు, బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్.. 2004లో జగన్ రూ. 2 లక్షల ఆసామి.. నేడు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? అని ప్రశ్నించారు.


ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు సంపాదించిన వారు జగన్ కాకుండా దేశంలో మరెవరైనా ఉన్నారా? చెప్పాలన్నారు రామయ్యజ దొడ్డిదారిన అక్రమంగా, అవినీతితో వేల కోట్లు కూడబెట్టారని.. టీడీపీ ఎప్పుడూ పేదల పక్షమే అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి రూ. 2 లకే కిలో బియ్యం పథంకం ప్రవేశపెట్టిన పార్టీ టీడీపీ.. పేదలకు పక్కా ఇళ్లు కట్టించినా.. పేద పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఘనత టీడీపీదే అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ పోటోలు వేసి వీళ్లు పేదల వ్యతిరేకులు అంటూ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు సిగ్గు, బుద్ది ఉందా? నైతిక విలువలు ఉన్న ఏ మనిషైనా ఇలా వ్యవహరించరన్నారు.


దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు ఇవ్వటం చేతకాక శవ రాజకీయాలు చేస్తున్నారని.. మంత్రి జోగి రమేష్ చనిపోయిన శవం దగ్గరకెళ్లి దాన్ని లేపి తీసుకెళ్లి శవరాజకీయం చేయాలని చూశారన్నారు. మృతుని బందువులు చివాట్లు పెట్టడంతో పలాయనం చిత్తగించారన్నారు. పేర్ని నాని తెగిన గాలిపటంలా ఏది పడిదే అది మాట్లాడుతున్నారని.. కొడాలి నాని ఎన్నికల ముందు దళిత వాడల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తున్నట్టు డ్రామాలు మొదలెట్టారన్నారు. వారి నాటకాలు నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ నేతల్ని జుట్టు పట్టుకుని విసిరి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిపై, దీనికి కారణమైన సీఎం జగన్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa