ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసాధారణ ఎండలతో అగ్ని గుండంలా రాష్ట్రం.. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 06:13 PM

గతంలో ఎన్నడూలేని విధంగా మార్చి నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తీవ్ర వడగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత పెరిగింది. శనివారం 19 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అనంతపురం, కర్నూలు, నందిగామ, కావలి, తుని, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పెరిగాయి. శనివారం 127 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు, 237 మండలాల్లో వడగాలులు వీచాయి.


ఆదివారం 64 మండలాల్లో తీవ్ర, 222 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల 44 డిగ్రీలు దాటేశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లి, వైయస్‌ఆర్‌ కడప జిల్లా బలపనూరు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 44.6, విజయనగరం జిల్లా రాజాంలో 44.4 డిగ్రీలుగా రికార్డయ్యాయి.


ఆదివారం విజయనగరం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 15, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరి, విశాఖల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశ ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa