కర్నూలు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలంరేపింది. వివాహానికి పెద్దలు కాదన్నారో.. లేక ఇతర కారణాలో తెలియదు కాని.. ప్రేమికులిద్దరు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది ఉండటంతో రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు.
చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం-మటుమర్రి రైల్వేస్టేషన్ల మధ్య టీబీ వంతెన వద్ద రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు కాదన్నారా.. లేక ఇతర కారణాలున్నాయో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం వరకు తమతో ఉన్న వారు సోమవారం ఉదయం శవాలుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa