ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్‌-2 ఫలితాలు ఎప్పుడో?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 01:30 PM

గ్రూప్‌-2 ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి మెయిన్స్‌కు ఎంత నిష్పత్తి నిర్ణయిస్తారు అనేది ఉత్కంఠకు కారణమైంది. 897 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఏపీపీఎస్సీ అత్యంత కఠినంగా రూపొందించింది. దీంతో ఎక్కువ మంది తెలియని ప్రశ్నలకు కూడా ఏదో ఒకటి అన్నట్టుగా సమాధానాలు పెట్టారు. దీనివల్ల నెగిటివ్‌ మార్కులు పెరిగాయి. మొత్తం 150 ప్రశ్నలతో కూడిన పరీక్షలో 90 ప్రశ్నలకు కూడా సమాధానాలు ఎంపిక చేయడం కష్టంగా మారిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిసారీ మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిని తీసుకుంటుండగా, ఈసారి పేపరు కఠినంగా వచ్చినందున 1:100 తీసుకోవాలని అభ్యర్థులు కోరారు. ఈ వినతితో పెద్దఎత్తున ఏపీపీఎస్సీకి లేఖలు పంపారు. దీనిపై స్పందించిన ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్‌ ఈసారి మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని తీసుకుంటారని ట్విటర్‌లో తెలిపారు. వారం రోజుల్లో దీనిపై ప్రకటన ఉంటుందని వెల్లడించారు. కానీ, ఆయన ట్వీట్‌ చేసి 20 రోజులైనా ఇంతవరకూ ఏపీపీఎస్సీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో కూడా వెల్లడించడం లేదు. నిష్పత్తిపై గందరగోళం నెలకొనడంతో ఫలితాలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రతిరోజూ వినతులు సమర్పిస్తున్నా ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదు. పరీక్ష రాసిన 4.04 లక్షల మంది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా ఫలితాలు ప్రకటిస్తే మెయిన్స్‌కు సన్నద్ధత, ఇతర పోటీ పరీక్షల కోసం సమయం కేటాయిస్తామని, ఈ జాప్యం వల్ల ఎటూ తేల్చుకోలేకపోతున్నామని కోరుతున్నా ఏపీపీఎస్సీ స్పందించడం లేదని వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa