ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార్షిక దివ్యకల్యాణోత్సవాల నిర్వహణపై సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 11, 2024, 05:30 PM

అన్నవరం, రత్నగిరివాసుడైన సత్యదేవుడికి వార్షిక దివ్యకల్యాణోత్సవాల నిర్వహణపై బుధవారం ఈవో రామచంద్రమోహన్‌ అధ్యక్షతన వైదిక కమిటీ, అన్ని విభాగాల ఏఈవోలు, సూపరింటెండెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రోధి నామ సంవత్సర స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు మే 18న వైశాఖ శుద్ధ దశమిరోజున స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండి ్లకుమార్తెలు చేయడంతో ప్రారంభమై 24న శ్రీపుష్పయోగంతో ముగుస్తాయి. 19న రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా దివ్య కల్యాణం నిర్వహిస్తారు. గతేడాది గోటి తలంబ్రాలుతో కల్యాణం అక్షింతలు తయారుచేయగా ఆ సంప్రదాయం అన్నవరం సత్యదేవుడికి లేనందున పూర్వపు పద్ధతిలో మాములుగా కల్యాణ అక్షింతలు తయారుచేయాలని సుమారు 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయాలని సూచించారు. అదే విధంగా గతేడాది స్వామి,అమ్మవార్ల శ్రీపుష్పయోగం ఆరుబయట వార్షిక కల్యాణవేదిక వద్ద చేపట్టడం దీనిపై విమర్శలు రావడం, పలువురు దీనిపై ఫిర్యాదులు చేయడంతో అనివేటి మండపంలో చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది కల్యాణోత్సవాలకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాజకీయనాయకులకు ఆహ్వానాలు పంపకుండా దేవదాయ కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలను మాత్రమే ఆహ్వానించనున్నారు. కల్యాణోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడికక్కడ క్యూలైన్‌లు పటిష్టపరిచి నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరగాలని ఆదేశించారు. వైదిక కార్యక్రమాల నిర్వహణను వైదిక కమిటీ సంప్రదాయాలను గౌరవించి శాస్త్రోక్తంగా చేపట్టాలని దీనిని వైదిక కమిటీ సభ్యులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఆలయానికి రంగులు, విద్యుద్దీప అలంకరణల విషయంలో రాజీ పడొద్దని ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ విభాగ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విభాగాల వారీగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. వచ్చేనెల మొదటి వారంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుదాయని అప్పటికి నిర్దేశించిన లక్ష్యాలు 90శాతం వరకు పూర్తికావాలని ఆదేశించారు. స్వామివారి దివ్య కల్యాణోత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పీఆర్వో కార్యాలయం దీనిని పర్యవేక్షించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్‌ రమేష్‌బాబు, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, పీఆర్వో దామెర కృష్ణారావు, ఏఈవోలు శ్రీనివాస్‌, జగ్గారావు, సూపరింటెండెంట్‌లు బలువు సత్యశ్రీనివాస్‌, ఐ.వి రామారావు, పర్వత నరసింహారావు, అనకాపల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa