రాళ్లదాడిలో గాయపడిన సీఎం జగన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో ఆదివారం నాటి బస్సుయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరామం ప్రకటించింది. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని తెలిపింది. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తోన్న సీఎం జగన్పై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీఎం ఎడమ కంటిపైన గాయమైంది. ఈ దాడి అనంతరం ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. తర్వాత ప్రచారాన్ని సీఎం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో శనివారం రాత్రి యాత్ర ముగించారు. సీఎం సతీమణి భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు.
అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. ‘సీఎం జగన్ నుదుటిపై అయిన గాయానికి రెండు కుట్లు పడ్డాయి. గాయం అంత తీవ్రమైనది కాదు. ప్రమాదం ఏమీ లేదు. వాపు ఎక్కువగా ఉంది.. రెండు మూడు రోజుల్లో సీఎం కోలుకుంటారు’’ అని విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, భారీ భద్రతావలంలో ఉండే సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్, 8 కి.మీ. దూరంలో సీపీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా... ప్రొటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం ఘోర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు.
సాధారణంగా సీఎం పర్యటన సాగే ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. రాత్రివేళ నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా లేదు. సీఎం పక్కనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్కూ రాయి తగిలి స్వల్ప గాయమైంది.