తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అధినేత చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం స్వయంగా బండారుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి, ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే బండారు పేరును ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి 1989 నుంచి గత పర్యాయం వరకు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు (1989, 1994, 1999), పెందుర్తి నుంచి 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో పరవాడ, 2009, 2019లో పెందుర్తి నుంచి ఓటమి చవిచూశారు. పెందుర్తి నియోజకవర్గం పార్టీ ఇన్చార్జిగా వున్న ఆయన ఈసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు పేరును అధినేత పవన్కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో బండారు అసంతృప్తి చెందారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వచ్చారు. కాగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు గత ఆదివారం విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమానాశ్రయంలో బండారు కలిశారు. తనకు మాడుగుల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన చంద్రబాబు.. ఇప్పటికే మాడుగుల అభ్యర్థిగా ప్రకటించిన పైలా ప్రసాదరావుకు నచ్చజెప్పి, బండారుకు మాడుగుల టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో అధికారింగా బండారు పేరును ప్రకటిస్తారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa