ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో ఆసక్తికర పరిణామం.. మొత్తానికి చేతులు కలిపిన ఇద్దరు నేతలు, టికెట్ రాకపోయినా సరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 08:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలిపారు. ఒకే పార్టీలో ఉన్నా సరే ఒకర్ని ఒకరు పలకరించుకోలేని శత్రుత్వం ఉంది.. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. పార్టీ గెలుపు కోసం చేతులు కలిపారు. ఈ పరిణామంతో రెండు వర్గాలు ఏకమయ్యాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గం ఏదో కాదు మైలవరం.


మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌‌లు రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి దేవినేని ఉమా, వైఎస్సార్‌సీపీ నుంచి వసంత పోటీచేయగా.. ఉమా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకానొక సమయంలో కృష్ణప్రసాద్‌ దేవినేని ఉమాకు పరువు నష్టం నోటీసులు కూడా పంపించారు. అయితే మైలవరంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వసంత కృష్ణప్రసాద్‌ వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు.. ఆ తర్వాత పరిణామాలతో తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దేవినేని ఉమా వర్గం ఆయన రాకను వ్యతిరేకించింది.


వసంత కృష్ణప్రసాద్‌ మొత్తానికి చంద్రబాబును ఒప్పించి తెలుగు దేశం పార్టీలో చేరారు.. అయితే ఆ తర్వాత మైలవరం టికెట్ ఎవరికి అనే చర్చ జరిగింది. ఈ విషయంలో కూడా దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్‌ పోటీపడ్డారు. అయితే చివరికి వసంతకు టికెట్ దక్కింది.. అంతకముందే చంద్రబాబు దేవినేని ఉమాను పిలిచి మాట్లాడారు.. టికెట్ రాకపోయినా మరో విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉమా కూడా కాస్త మెత్తబడ్డారు. అయితే తాజాగా మరో ఆసక్తికర పరిణామం కనిపించింది.


దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్‌లు చేతులు కలిపారు. గొల్లపూడిలోని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి తెదేపా మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ఆదివారం రాత్రి వచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. రాక్షసరాజ్యాన్ని కూల్చేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. తంగిరాల సౌమ్య, కృష్ణప్రసాద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ తమ మధ్య వ్యక్తిగత వైరం లేదన్నారు. తన నామినేషన్‌ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావును ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలిపారు. మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండటం.. దానికి తోడు విభేదాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి రావడం తమకు కలిసొస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa