ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి నెలకొంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. మరో 3 రోజుల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు, అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఎన్నికల ప్రచార హోరును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగానే అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న రామాయణం సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ నిర్వహించిన ర్యాలీలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. సెల్ఫోన్లు, డబ్బులు, పర్సులు కొట్టేశారు.
టీవీ రాముడిగా బాగా పేరు సంపాదించిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్.. మీరట్లో భారీ ఎన్నికల ర్యాలీ చేపట్టారు. ఈ రోడ్ షోకు చాలా మంది కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ చేతులు పైకెత్తి జై శ్రీరాం అనాలంటూ అరుణ్ గోవిల్ పిలుపునివ్వగా.. అందుకు అనుగుణంగా అంతా చేతులు పైకెత్తారు. ఇదే అదనుగా దొంగలు తమ పని కానిచ్చారు. ఆ రోడ్ షోకు హాజరైన బీజేపీ నేతలు, జర్నలిస్ట్లు, బిజినెస్మెన్ల ప్యాంటు జేబుల్లో ఉన్న డబ్బు, సెల్ఫోన్లు, పర్సులను ఎత్తుకెళ్లారు.
ఈ ర్యాలీలో అరుణ్ గోవిల్తోపాటు రామాయణం సీరియల్లో సీత, లక్ష్మణుడిగా నటించిన దీపికా చిక్లియా, సునీల్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఓ బిజినెస్మెన్ జేబులో నుంచి రూ.36 వేలు దొంగలు మాయం చేశారు. తన దుకాణం ముందు నుంచి అరుణ్ గోవిల్ రోడ్ షో వెళ్తోందని.. దీంతో తాను కూడా కొద్దిసేపు అందులో పాల్గొన్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. తాను కూడా చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అని నినాదాలు చేశానని.. ఆ తర్వాత తన జేబులో చేయి పెట్టి చూసుకోగా.. ఇందులో ఉన్న రూ. 36 వేలు ఎవరో మాయం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఇదే ర్యాలీలో పాల్గొన్న మరికొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు కూడా ఈ చోరీల బారిన పడ్డారు. దీంతో బాధితులు మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి నుంచి కొన్ని సెల్ఫోన్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
![]() |
![]() |