వైసీపీ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి ఇద్దరు భార్యల పిల్లలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి దిగారు. అది కూడా ఒకే నియోజకవర్గం మాడుగల నుంచే కావడం విశేషం. బూడి మొదటి భార్య కుమారుడు రవి, రెండో భార్య కుమార్తె అనూరాధ ఇక్కడ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ముత్యాల నాయుడు అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో 2019లో తాను గెలిచిన మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన.. తన రెండో భార్య కుమార్తె అనూరాధకు టికెట్ ఇప్పించుకున్నారు. ప్రస్తుతం కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అనూరాధ నామినేషన్ కూడా వేశారు.ఇంతలో తెరమీదకు వచ్చిన మొదటి భార్య కుమారుడు రవి ముత్యాలనాయుడి వారసుడినైన తనకు టికెట్ ఇవ్వకుండా అనూరాధకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ.. బుధవారం మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం, రవి మాట్లాడుతూ.. గతంలో తాను జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నానన్నారు. ఇప్పుడు సమయం వచ్చిందని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. నాయకులు పథకాల ఆశ చూపుతారని, ఓటర్లు మోసపోవద్దని ఆయన సూచించారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఏం కావాలో అది చేసి తన సత్తా ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa