తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో మూడురోజుల పాటు ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. మే 17 వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకూ తిరుమలలో శ్రీపద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు, వేడుకల నేపథ్యంలో మే 17 నుంచి 19 వరకూ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శ్రీపద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా స్వామివారు తొలిరోజు గజవాహనంపై, రెండో రోజు అశ్వవాహనంపై, మూడో రోజు గరుడవాహనంపై వేంచేస్తారు. ఇక అమ్మవార్లు ఇద్దరు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవానికి చేరుకోగా.. ఆ తర్వాత కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
మరోవైపు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించడానికి కూడా ఓ కారణం ఉంది. హిందూ పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీమహావిష్ణువు.. శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పాలిస్తున్న ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చి పెళ్లిచేశారు. అయితే వైశాఖ శుద్ధ దశమి రోజున పూర్వఫాల్గుణి నక్షత్రంలో కన్యాదానం జరిగినట్లు పురాణాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా మూడురోజులపాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది.
మరోవైపు 1992 సంవత్సరం నుంచి ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతీ పరిణయోత్సవాలు జరుగుతున్నాయి, నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, ఆ రోజు, ఆ తర్వాతి రోజు .. ఇలా మూడురోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa