విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి (అప్పన్న) టీటీడీ తరపున శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శుక్రవారం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ 1996 నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది.
సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. శుక్రవారం వేకువజాము నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు స్వామి దేహంపై ఉన్న చందనాన్ని ఒలిచి చందనోత్తర కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నిజరూప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శీతల నివేదనల్ని సమర్పించారు అర్చకులు. ముందుగా అనువంశిక దర్శకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు స్వామివారికి పూజలు చేసి తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. దాదాపుగా 90 వేల మంది భక్తులు నిజరూపాన్ని దర్శించుకున్నట్లు చెబుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa