పాకిస్థాన్ మరోసారి భారత అంతర్గత విషయంలో జోక్యం చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన సంఘటన గురించి పాక్ స్పందించింది. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రావడంపై పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ నోరు పారేసుకున్నారు. ఈ ఘటనపై నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫవాద్ చౌదరీ.. ప్రధానమంత్రి మరో యుద్ధంలో ఓడిపోయారని అన్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ విడుదల మితవాద భారతదేశానికి గుడ్న్యూస్ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో భారత రాజకీయాల్లో పాక్ రాజకీయ నేతల జోక్యం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఇక ఇదే సమయంలో భారత్, పాకిస్థాన్లో పాలన వ్యవస్థపై ఫవాద్ చౌదరీ కొన్ని కామెంట్లు చేశారు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్లో సివిల్ సొసైటీ, బార్ అసోసియేషన్లు, న్యాయ వ్యవస్థలు, మీడియా సంస్థలు, మానవహక్కుల సంస్థలు పూర్తిగా విఫలం అయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పాక్లోని న్యాయ సంస్థలపై ఫవాద్ చౌదరీ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. పాక్లో న్యాయవ్యవస్థ భవిష్యత్ తీవ్ర ప్రమాదంలో ఉందని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ఇక దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ఫవాద్ చౌదరీ ఇటీవల ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై మాత్రం ఆయన ప్రశంసలు కురిపించారు. దేశంలో ఆర్థిక సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీని కొనియాడారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని రాహుల్ సాహిబ్ అని పిలిచి ఫవాద్ చౌదరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. భారత తొలి ప్రధానమంత్రి, తన తాత జవహర్ లాల్ నెహ్రూను రాహుల్ గాంధీ.. అనుసరిస్తున్నారని, సోషలిస్ట్ సంస్కరణలను నమ్ముతున్నారని పేర్కొన్నారు.
అదే సమయంలో రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిన ఫవాద్ చౌదరీ.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. పాక్, భారత్ సహా ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదులను, ద్వేషాన్ని పెంచేవారిని తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. అయితే పాక్ మాజీ మంత్రి రాహుల్ గాంధీని ప్రశంసించడంపై మన దేశంలో రాజకీయ దుమారం రేగింది. పాకిస్థానీ నాయకులు కాంగ్రెస్ షెహజాదాని భారత ప్రధానిని చేయాలనుకుంటున్నారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాక్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం బయటికి వచ్చిందని ఫవాద్ చౌదరీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో దుమారం రేపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa