ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా కోర్టులో జగన్‌కు శిక్ష తప్పదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 01:01 AM

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ప్రజల ఆస్తులకు పంగనామాలు పెడతారని సినీ నటుడు శివాజీ చెప్పారు. ఆయన శనివారం మండలంలోని పెదఉల్లగల్లు, లక్ష్మీనగర్‌ గ్రామాల్లో దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల భవిష్యత్‌ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. మాట మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకుంటూ వారిపైనే దాడులు, హత్యలు రాష్ట్రంలో కోకొల్లులుగా జరిగాయన్నారు. ప్రజా కోర్టులో జగన్‌కు శిక్ష తప్పదన్నారు. రెండు నెలలు ఆగితే పరిపాలన అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. అవినీతి, అరాచకం రాజ్యమేలిందని, ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయటం, అక్రమకేసులు బనాయించటంలో నేతలు ఆరితేరిపోయారని చెప్పారు. 22ఏ భూముల్లో కూడా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారని చెప్పారు. లక్ష్మీ తాతహనుమంతరావు, ఆమె తండ్రి నరసయ్య ఎంతో అభివృద్ధి చేసి నీతి నిజాయితీతో రాజకీయం చేశారన్నారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ మీ ఇంటి ఆడ బిడ్డగా ఆదరించండి, అభిమానించండి, సేవ చేసే భాగ్యం కల్పించండి అని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొక్కెర నాగరాజు, మాజీ సర్పంచ్‌ జిల్లెలమూడి చౌదరి, కొండవీటి సుబ్బారావు, కర్నాటి సాయికుమార్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు కొండవీటి బాలయ్య, కామని పూర్ణచంద్రరరావు, కాలేషా, వలి, వాతల వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa