ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టీడీపీ కూటమిదే అధికారం.. తేల్చేసిన కాంగ్రెస్ సీనియర్ లీడర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:34 PM

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మే 13వ తేదీ పోలింగ్ పూర్తికాగా.. అప్పటి నుంచి విజయంపై ఇరు పక్షాలు ధీమాతో ఉన్నాయి. అధికారం మాదంటే మాదంటూ అటు కూటమి నేతలు, ఇటు వైసీపీ లీడర్లు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే సగటు ఏపీవాసి మాత్రం విజయం ఎవరిదోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవటంతో విజయం ఏ పార్టీదోనంటూ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు సైతం ఏపీ ఎన్నికలపై తమ అంచనాలను ఇప్పటికే వెల్లడించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు వంటి వారు సైతం ఏపీ ఎన్నికలపై తమ అంచనాలను వెల్లడించారు.


అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏపీ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ చింతా మోహన్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామని వైసీపీ నేతలు ఊహల్లో ఉన్నారన్న చింతామోహన్.. గెలుపు మాత్రం టీడీపీ కూటమిదేనని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లు.. చంద్రబాబుకు పడ్డాయని చింతామోహన్ చెప్తున్నారు. ఏపీ ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 4 వేల నుంచి 5 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. మరోవైపు కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ జోస్యం చెప్పారు.


మరోవైపు ఏపీలోని 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగగా.. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. అటు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ తరుఫున తిరుపతి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తిరుపతి లోక్ సభ స్థానానికి కూటమి తరుఫున బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు, వైసీపీ నుంచి గురుమార్తి పోటీచేస్తున్నారు. మరి చింతామోహన్ జోస్యం ఎంతమేరకు నిజమవుతుందో జూన్ నాలుగవ తేదీ విడుదలయ్యే ఫలితాలతో తేలనుంది. అంతకుముందే జూన్ ఒకటో తేదీ సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఓ స్పష్టత రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa