ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగబాబు ట్వీట్‌కు పోతిన మహేష్ కౌంటర్ ట్వీట్.. స్నేక్ బాబు, పుష్ప అంటూ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 03:52 PM

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినా రాజకీయ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు కామెంట్లు, సోషల్ మీడియా పోస్ట్‌లతో రాజకీయ వేడిని చల్లారనీయడం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగబాబు చేసిన ట్వీట్.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ట్వీట్‌కు సోషల్ మీడియాలో తీవ్ర నెగిటివ్ ట్రోలింగ్ ఎదురైంది. అయితే ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్‌ను తొలగించినా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. గతంలో జనసేనలో ఉండి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన పోతిన మహేష్ తాజాగా నాగబాబుపై సంచలన వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు జనసైనికులు కామెంట్లు చేస్తూ పోతిన మహేష్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఇది ట్విట్టర్ వార్‌గా మారింది.


ఇక నాగబాబు ట్వీట్‌కు కౌంటర్‌గా మరిన్ని ట్వీట్లు చేసిన పోతిన మహేష్.. ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసినా అది కాటు వేస్తుంది. వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా. కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు.. ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న "పుష్ప" 2019 లో జనసేన పార్టీకి రూ.2 కోట్ల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. 2009, 2019, 2024 లో అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగాఫ్యామిలీ అనాలా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఎక్కడా నాగబాబు పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆ ట్వీట్లు చూస్తే మాత్రం అదే అర్థం అయిపోతుంది.


అయితే ఎన్నికలకు ముందు నాగబాబు చేసిన ట్వీట్ కారణంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన కొన్ని రోజుల పాటు ట్విటర్‌లో సైలెంట్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. "నా ట్వీట్‌ను తొలగించాను" అని నాగబాబు ఒక పోస్ట్‌ చేశారు. ‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరిచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ సరిగ్గా ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌‌ మాత్రమే కాకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా నాగబాబు, జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా చివరి రోజు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడం తీవ్ర దుమారానికి కారణం అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa