సీతంపేట పరిధిలో ఘాట్రోడ్డులో అదుపుతప్పి వంద అడుగుల లోయలో ఆటో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా క్షతగాత్రులుగా మారారు. అందులో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. సీతంపేట మన్యంలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ పరిధి వంబరవెల్లి గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులు ప్రతి వారంలానే సోమవారం తెల్లవారుజామున సీతంపేట సంతకు బయల్దేరారు. ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపేటకు ఆ గ్రామానికి చెందిన ఆటోలోనే ప్రయాణించారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతకు చేరారు. అక్కడ వారి అటవీ ఉత్పత్తులను విక్రయించి.. ఇంటికి అవసరమైన నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. ఉదయం 8:30 గంటలకు తిరిగి అదే గ్రామానికి చెందిన ఆటోలో 17 మంది తిరుగు ప్రయాణమయ్యారు. అయితే కిలోమీటరు దూరంలో ఉన్న స్వగ్రామానికి వారు చేరుతారనగా ఊహించిన ఘటన చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డుపైకి ఆటో వెళ్తున్న సమయంలో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో డ్రైవర్ మధు గేర్ మార్చాడు. అయితే సీసీ రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా ఆటో వెనక్కి జారీ వంద లోడుగుల లోయలో పడింది. దీంతో వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా రక్తపు గాయాలతో చెల్లాచెదురుగా పడిపోయారు. మొత్తంగా క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు , గ్రామస్థులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన వారిని అతికష్టం మీద రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అంతకముందు వారు పోలీసులు, అంబులెన్స్లకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన సీతంపేట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. 17 మందిలో ఒకరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే సవర కార్తీక్ (8)ను చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మిగతా 15 మంది క్షతగాత్రులను రెండు 108 వాహనాలు, ఆటోల ద్వారా సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు అక్కడే చికిత్స పొందుతున్నారు. మిగిలిన 12 మందిలో ఒకరిని పాలకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మిగతా 11 మందిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఆటో డ్రైవర్ మఽధు పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం సిక్కోలులోని రిమ్స్లో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa