టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa