ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముదినేపల్లి మండలంలోని దేవరంలో చేపల చెరువుపై కాపలా ఉంటూ ఈ నెల 13న అదృశ్యమైన అత్తిలికి చెందిన దండు శ్రీరామరాజు (76) అనే వృద్ధుడి ఆచూకీ లభ్యమైంది. చెరువు వద్ద తాడు తెంచుకుని పారిపోతున్న ఆవును పట్టుకునేందుకు వెళ్లిన ఆ వృద్ధుడు వడాలి గ్రామం వరకు వెళ్లి తిరిగిరాని విషయం తెలిసిందే. అక్కడ నుంచి దారి తప్పి చినగొన్నూరు మీదు గా గుడ్లవల్లేరు చేరుకొని శనివారం సాయంత్రం గుడివాడ చేరుకున్నాడు. గుడ్లవల్లేరులో ఆ వృద్ధుడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుండగా, ఫొటో చూసిన ఒక వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు గుడివాడలో శ్రీరామ రాజును కనుగొని ఆదివారం సాయంత్రం దేవరంలోని ఇంటికి తీసుకొచ్చారు.