బెంగళూరు- ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్ను అభివృద్ధి చేస్తోన్న కేంద్రం.. రెండు నగరాల రాకపోకలు త్వరగా సాగించేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ మార్గంలో హైస్పీడ్ రైలును ప్రవేశ పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్రానికి రైల్వేశాఖ ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడించారు. బెంగళూరు- ముంబయి నగరం మధ్య తిరిగే హైస్పీడ్ రైలు తుమకూరు, దావణగెరె, హుబ్బళ్లి - ధార్వాడ, బెళగావి- పుణె మీదుగా ప్రయాణించనుంది. బెంగళూరు- పుణె- ముంబయి మధ్య ఇండస్ట్రియల్ కారిడార్కు శ్రీకారం చుట్టిన కేంద్రం.. ఆ ప్రాంతంలో సంస్థల ఏర్పాటుకు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.
ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, బెంగళూరు - ముంబయి కారిడార్ విషయానికి వస్తే కర్ణాటకలోని ఆరు స్మార్ట్ సిటీలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతో ఆ నగరాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుమకూరు ఇండస్ట్రీయల్ హబ్ను జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. తుమకూరు మిషన్ టూల్స్ పార్క్, జపాన్ పారిశ్రామిక హబ్లను అభివృద్ధి చేస్తున్నారు.
హుబ్బళ్లి - ధార్వాడ ఇండిస్ట్రియల్ హబ్ అభివృద్ధికి 605 ఎకరాలను సేకరించారు. ఇప్పటికే అక్కడ వివిధ రకాల ఆటోమొబైల్ పరిశ్రమలు ఉండగా... బెళగావిలో ఏరోస్పేస్ సెజ్ ఏర్పడింది. ఇందులో బెళగావి పారిశ్రామిక హబ్ను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ధార్వాడలో ఐఐటీ, ఐఐఐటీతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు ఉన్నాయి. కర్ణాటక లా యూనివర్సిటీ, విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ, కర్ణాటక వర్సిటీలు బెళగావిలో ఉండటం వల్ల రెండు నగరాలు విద్యా కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. బెంగళూరు - ముంబయి ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఆ ఆరు నగరాలు పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చెందుతాయని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa