ఏపీ ప్రజలకు గన్నవరం ఎయిపోర్ట్ అధికారులు శుభవార్త చెప్పారు.. కార్గో సేవలు పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఒమేగా ఎంటర్ ప్రైజెస్ సంస్థ కార్గో సర్వీసులను తిరిగి ప్రారంభించింది. విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, ఒమేగా సంస్థ ప్రతినిధులు ముత్తు, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఒమేగా సంస్థ కార్గో సర్వీస్ పునఃప్రారంభించడం అభినందనీయం అన్నారు గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి. కార్గో సర్వీస్ తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయన్నారు లక్ష్మీకాంతరెడ్డి. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచికమన్నారు. రానున్న రోజుల్లో విమాన సర్వీసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న కార్గో బిల్డింగ్ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాదు పౌరవిమానయాన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్గో బిల్డింగ్ విస్తరణకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో 2021లో కార్గో సేవలకు అడుగులు పడ్డాయి.. అయితే కరోనా కారణంగా ఆగిపోయింది. తాజాగా కార్గో సేవల్ని తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు పిలవగా.. ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ టెండర్ను దక్కించుకుంది. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతో పాటు పూలు, పండ్లు, మిర్చి, తదితర ఉత్పత్తులను దేశంలో ఇతర ప్రాంతాలకు కార్గో సర్వీస్ ద్వారా పంపించొచ్చన్నారు. ఈ ఉత్పత్తుల్ని సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చేందుకు కార్గో సర్వీసు ఉపయోగపడుతుంది అంటున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సర్వీసు నడిపేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa