ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకన్న సన్నిధిలో ఘరానా మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 10:32 PM

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో మరో కొత్త మోసం వెలుగు చూసింది. భక్తుల ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును మోసం చేస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటూ టీటీడీని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ రకంగా రెండు నెలల్లో 45 గదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తరుచుగా గదులు తీసుకుంటున్న వైనాన్ని గుర్తించిన టీటీడీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్‌కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు.


ఇక ఇద్దరు నిందితుల మీద కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఇద్దరూ విలాసాలకు అలవాటు పడి తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆధార్ కార్డులు వేరే ఎవరైనా వీరికి ఇచ్చి సహకరిస్తున్నారా లేదా ఫేక్ ఆధార్ కార్డుల సాయంతో గదులు తీసుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఆధార్ కార్డుల సాయంతో తిరుమలలో రూ50, రూ.100ల గదులు అద్దెకు తీసుకుంటున్న నిందితులు.. ఆ తర్వాత ఆ గదులను రూ.1000ల అద్దెకు ఇస్తున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చిన సొమ్మను వ్యసనాలకు ఉపయోగిస్తున్నట్లు తిరుమల పోలీసులు తెలిపారు. ఈ దళారీ వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, టీటీడీ విజిలెన్స్ విభాగంతో కలిసి దీనిపై నిఘాపెట్టి దళారులను పట్టుకుంటామని తిరుమల పోలీసులు తెలిపారు.


మరోవైపు టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన ప్రారంభమైంది. టీటీడీ ఈవో ఆదేశాలతో ఇప్పటికే తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిపెట్టారు. దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ ఐటీ విభాగం ద్వారా భారీగా గదులు పొందిన వారిని, ఇతర అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆధార్ కార్డుల సాయంతో గదులు పొందుతూ అధిక ధరలకు భక్తులకు అమ్ముతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa