ఏపీలో టీడీపీ కూటమి నెలరోజుల పాలనను పూర్తి చేసుకుంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ కూటమి.. అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు పూరైన నేపథ్యంలో నెలరోజుల పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
ఈ 30 రోజుల్లో 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని టీడీపీ తెలిపింది. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.4000కు పెంచామని, దివ్యాంగుల పింఛన్ను రెట్టింపు చేసి రూ.6000కి పెంచినట్లు తెలిపింది. ఇక ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని ట్వీట్ చేసింది. వైసీపీ పాలనలో మూలనపడిన రాజధాని అమరావతి పనులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునః ప్రారంభించినట్లు తెలిపింది.
నెలరోజుల పాలనలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులను 2026 నాటికి పూర్తిచేయాలని గడువు నిర్దేశించుకున్నామన్న టీడీపీ.. ఏపీకి పరిశ్రమలను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఏపీలో రూ.60 వేలకోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టామని, అమరావతిలో XLRI విద్యాసంస్థను కూడా తీసుకువస్తున్నట్లు టీడీపీ తెలిపింది. ఈ 30 రోజుల్లోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి, విజయవాడ తూర్పు బైపాస్కు ఆమోదం లభించినట్లు తెలిపింది.
నెలరోజుల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందించామని.. పట్టిసీమను మొదలుపెట్టి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశామని, తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించామని టీడీపీ ట్వీట్ చేసింది. 48 గంటల్లోగా అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని, ఐదేళ్ల తర్వాత పలాసకు తాగునీరు, పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్లు అందించామని చెప్పింది. వైజాగ్ మెడ్ టెక్ జోన్లో కంపెనీలో ప్రారంభం, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రైతుబజార్లలతో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు, రాజముద్రతో పాసుపుస్తకాలు వంటి పనులు కూడా ఈ నెలరోజుల్లోనే జరిగాయని టీడీపీ గుర్తు చేసింది.
ఇక ఒక్క వాట్సాప్ కాల్తో దివ్యాంగు విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారన్న టీడీపీ.. ఈ నెల రోజులలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులతో సమావేశమయ్యారని ట్వీట్ చేసింది. చంద్రబాబు నెలరోజుల పాలనలో తెలంగాణతో విభజన సమస్యలపై ముందడుగు పడిందని, గంజాయి, డ్రగ్స్ కట్టడిపై చర్యలు ప్రారంభమైనట్లు పేర్కొంది. స్కిల్ సెన్సస్ మీద కసరత్తు కూడా ప్రారంభమైందన్న టీడీపీ.. ఇక ఆగస్ట్ 15 నుంచి అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa