పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయించడం, మార్కాపురం జిల్లాను సాధించుకోవడమే తమ ముందున ప్రథమ కర్తవ్యమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక జవహర్నగర్ కాలనీలోని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుస్తామన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యమన్నారు. త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. అంతేకాకుండా మార్కాపురం జిల్లా విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చినందున మార్కాపురం జిల్లా తప్పక ఏర్పడుతుందన్నారు. మార్కాపురం పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్నదని, దాని పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా ప్రస్తుతం నీరు సరఫరా చేస్తున్నారన్నారు. ఎగువన కర్నాటకలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున సాగర్ నీటిని విడుదల చేయించేందుకు తప్పక ప్రయత్నిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, డీవీ కృష్ణారెడ్డి, వెన్నా పోలిరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాసులు, స్వర్ణ గీత, కాటూరి పెదబాబు, పండు, జవ్వాజి రామాంజులరెడ్డి, మాలపాటి వెంకటరెడ్డి, ఉలవా గోపి, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రామనారాయణరెడ్డి, నాలి కొండయ్య, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa