గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేస్తామని.. కొత్త చట్టం తెస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే కౌలురైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని వెల్లడించారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు కౌలురైతులకు శుభవార్త వినిపించారు.
2019లో వైసీపీ తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామన్న అచ్చెన్న... భూమి యజమాని అంగీకారం ఉంటేనే కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని మెలిక పెట్టడంతో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తెచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి.. 2016లో టీడీపీ ప్రభుత్వం కౌలు రైతుల కోసం చేసిన చట్టాన్ని అమలు చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి కౌలు రైతుకు పరిహారం, బ్యాంకు రుణాలు అందేలా చూస్తామని ప్రకటించారు.సహకార సంఘాల్లో ఈ- కేవైసీనీ అమలు చేస్తామని.. కౌలు రైతులను కూడా సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందిస్తామన్నారు.
మరోవైపు పంట రుణాల విషయంలోనూ అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పంట రుణాలను పెత్తందారులకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలన్న అచ్చెన్నాయుడు.. అర్హులను గుర్తించేందుకు డిజిటలైజేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపైనా విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల భూమి వివరాలను వెబ్ ల్యాండ్లో ఉంచి పొరబాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆప్కాబ్, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు సైతం రుణాలు ఇవ్వాలని అన్నారు. అన్ని జిల్లాలలోనూ ఆప్కా్బ్, డీసీసీబీ శాఖలను విస్తరిస్తామని.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ కార్యక్రమంలో భాగంగా ఆప్కాబ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాట్సప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఇందులో మొదటి సభ్యుడిగా చేరిన అచ్చెన్నాయుడు. ఆ తర్వాత 26 జిల్లాల అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa