ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాగలమర్రిలో మిద్దె కూలిన ఘటనపై చంద్రబాబు విచారణ,,,ఒంటరిగా మిగిలిన బాలికకు రూ.10 లక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 08:14 PM

నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి నలుగురు చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు, కుటుంబాన్ని కోల్పోయి అనాథగా మిగిలిన ప్రసన్న అనే బాలికకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఆ బాలిక సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి నలుగురు మరణించారు. వర్షాల కారణంగా మట్టి మిద్దె కూలిపోవటంతో రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు చనిపోయారు. తల్లపురెడ్డి గురుశేఖర్‌తో పాటుగా ఆయన భార్య దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి ప్రాణాలు కోల్పోయారు.


 అయితే రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో చదువుతోంది. ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోవటంతో ప్రసన్న ఒంటరి అయ్యింది. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి చేరటంతో ఆయన స్పందించారు. ప్రసన్నకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రసన్న తరుఫున రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాన్నమ్మ సంరక్షణలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రసన్న నాయనమ్మకు కూడా కుటుంబ పోషణ కోసం రెండు లక్షలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరుఫున కూడా ప్రసన్న సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక మిద్దె కూలిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పాటుగా మట్టి మిద్దె కావటంతో కూలినట్లు భావిస్తున్నారు. అయితే ఒకేసారి కుటుంబం మొత్తం దూరం కావటంతో ప్రసన్న భవిష్యత్తు ఏమవుతుందోనని స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధురాలైన నాన్నమ్మ సంరక్షణలో ఎలా చదువుకుంటుందోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాలిక సంరక్షణ సైతం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa