అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ చీఫ్ కన్వీనర్.. గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. మొదట ఈడీ అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. ఇక ఈడీ కేసులో బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో ఊరట లభించకపోవడంతో జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలోనే జైలు నిబంధనల ఉల్లంఘనలకు అరవింద్ కేజ్రీవాల్ పాల్పడ్డారని జైలు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు తాజాగా ఒక లేఖ రాశారు. అయితే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీహార్ జైలు అధికారులు పేర్కొనడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది.
అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గవర్నర్కు రాసిన లేఖలో స్వాతంత్ర్య వేడుకల గురించి ప్రస్తావించడమే ఇప్పుడు కొత్త సమస్యకు కారణం అయింది. జైలు నిబంధనలను కేజ్రీవాల్ ఉల్లంఘించారంటూ జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం.. కస్టడీలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటిని మాత్రమే.. రాసే లేఖలో పేర్కొనాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాసిన కేజ్రీవాల్.. అందులే తన వ్యక్తిగత విషయం కాకుండా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ఆగస్ట్ 15 వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం జెండా ఎగురవేయాల్సి ఉండగా.. ప్రస్తుతం తాను జైలులో ఉన్నందున.. తన తరఫున ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషీ మార్లేనా జెండాను ఎగురవేస్తారని.. ఎల్జీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ వెల్లడించారు. ఇది పూర్తిగా జైలు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని.. అందుకే ఈ లేఖ బయటకు వెళ్లలేదని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి.
అయితే.. వినయ్ కుమార్ సక్సేనాకు కేజ్రీవాల్ రాసిన ఈ లేఖ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేరుకోలేదు. అయినప్పటికీ.. అందులోని విషయాలు ఎలా బయటికి వచ్చాయి అనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో కేజ్రీవాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. జైలు అధికారులు ఆరోపిస్తున్నారు. జైలు నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే.. కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు పేర్కొంటున్నారు. కాగా
మరోవైపు.. ఈడీ కేసులో బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. అయితే తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్ తరఫు లాయర్ సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. అయితే ఆ పిటిషన్ను మెయిల్ పంపించాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం వ్యవహారంలో గతేడాది అరెస్ట్ అయిన.. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్పై బయటికి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa