పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఐదు పథకాల పేర్లను ఏపీ ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చారు. అలాగే జగనన్న విద్యాకానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరు ముద్ద పథకాన్ని.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. అలాగే మన బడి - నాడు నేడు పథకం పేరును మన బడి- మన భవిష్యత్తు అని మారుస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటుగా స్వేచ్ఛ పథకం పేరును బాలికా రక్షగా.. జగనన్న ఆణిముత్యాలు పథకం పేరును.. అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేర్లు మారుస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ విద్యాశాఖ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో మార్చిన అనేక పథకాల పేర్లను మారుస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ప్రారంభించిన పథకాల పేర్లను కూడా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి పథకం పేరును.. తల్లికి వందనంగా మార్చారు. మరోవైపు ఈ పథకం కింది పిల్లలను పాఠశాలలకు పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15000 చొప్పున గత వైసీపీ ప్రభుత్వం జమ చేస్తూ వచ్చింది. అయితే ఈ మొత్తంలో టీఎంఎఫ్, ఎస్ఎంఎఫ్ పేరిట సుమారుగా రెండు వేల వరకూ కోత విధించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా.. ఒక్కొక్కరికీ రూ. 15000 చొప్పున ఖాతాల్లో వేస్తానంటూ టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. దీనికి తల్లికి వందనం అనే పేరు పెట్టింది. తాజాగా అమ్మ ఒడి పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు జగనన్న గోరు ముద్ద పథకం కింద.. బడికి వెళ్లే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే పథకం ఏపీలో ఆమల్లో ఉంది. అయితే దీనికి డొక్కా సీతమ్మ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ మధ్య సూచించారు. అయితే అన్న క్యాంటీన్లకు బదులుగా స్కూళ్లల్లో చిన్నారులకు భోజనం అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa