వరద సృష్టించిన విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదనీరు తగ్గుముఖం పడుతూ ఉండటంతో అధికారులు.. తదుపరి చర్యలపై దృష్టిసారించారు. వరద ప్రవాహం కారణంగా పలుచోట్ల బురద కమ్మేసింది. వరద నీరు తగ్గుతున్న నేపథ్యంలో.. ఈ పేరుకుపోయిన బురదను తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫైరింజన్ల సాయంతో బురదను తొలగించాలని నిర్ణయించారు. ఇందుకోసం అగ్నిమాపక యంత్రాలను విజయవాడకు రప్పించారు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బురదను క్లీన్ చేసేందుకు ఇప్పటికే కొన్ని ఫైరింజన్లు చేరుకున్నాయి. వరద తగ్గిన విద్యాధరపురం సహా 45 డివిజన్లలో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నారు. వంద అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది ప్రస్తుతం ఈ పనిలో ఉన్నారు.
మరోవైపు విజయవాడ వాసులను బుడమేరు మళ్లీ భయపెడుతోంది. బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతూ ఉండటం కలవరపెడుతోంది. మంగళవారం వేయి క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. బుధవారం 8 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బుడమేరుకు మూడు చోట్ల గండి పడగా.. మొదటి గండిని ఇప్పటికే పూడ్చారు. మిగతా రెండు గండ్లను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బుడమేరులో వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో గండ్లు పూడ్చటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఏపీలో వానలు, వరదలు కారణంగా ఇప్పటి వరకూ ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 మంది చనిపోయారు. సుమారుగా ఆరు లక్షల మందిపై వర్షాలు, వరదల ప్రభావం పడింది.
అయితే భారీ వర్షాలు, వరదల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్న ఏపీవాసులకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. మరో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... అల్లూరి సీతారామారాజు, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa