కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో స్టార్ రెజర్లు వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా భేటీ అయ్యారు. కశ్మీర్ పర్యటనకు బయల్దేరే ముందు ఇరువురితో రాహుల్ ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో ఇరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని, హరియాణా ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. హరియాణా శాసనసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను త్వరలోనే వెలువరించనున్నారు. ఈ ఇద్దరికీ టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
కానీ, దీనిపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, వినేశా ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనుందని, జననాయక్ జనతా పార్టీకి చెందిన అమరజీత్ ధండాను ఢీకొట్టనుందనే ప్రచారం జరుగుతోంది. బజరంగ్ పునియాకు ఏ సీటు ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు. కాగా, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ హరియాణా ఎన్నికల్లో పోటీచేసే 34 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను ఖరారు చేసింది.
తుది జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ఇందులో వినేశ్ ఫోగట్, బజ్రంగ్ పునియా పేర్లు కూడా ఉంటాయా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ప్రశ్నించగా సమాధానం దాటవేసింది. తాజాగా, ఇరువురూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ కావడం మరింత వేడెక్కింది.
రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వినేశ్ ఫొగాట్ సహా మహిళా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కొద్ది రోజులు రెజ్లర్లు నిరాహార దీక్ష చేపట్టారు. దీనిపై విచారణకు కమిటీ వేస్తామన్న కేంద్రం హామీతో దీక్షను విరమించారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్కు బీజేపీ టిక్కెట్ నిరాకరించింది. ఆయనకు బదులుగా కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ను పోటీకి దింపింది. అయితే, వినేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో మరోసారి లైంగిక వేధింపుల వ్యవహారం రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa