మాజీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రోజా అనుకున్నది సాధించారు.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు.. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
'చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గానికి చెందిన కేజే కుమార్ (రాష్ట్ర వైఎస్పార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి, కేజే శాంతి (మాజీ ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్), వీరి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి వ్రాత పూర్వకమైన ఫిర్యాదు అందింది. వారిపై పేర్కొన్నఅభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ కమశిక్షణ కమిటీ సిపార్సు చేసింది. ఈ మేరకు వారిని పార్టీ నుంచి తొలగిస్తూ, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాము. ఇక మీదట వారు ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసినా.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను'అంటూ భరత్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
నగరి నియోజకవర్గంలో రోజా, కేజే దంపతుల మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేజే దంపతులకు మరికొందరు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలో కూడా వివాదం నడిచింది.. మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు. అప్పటి నుంచి ఈ వార్ మరింత ముదరింది. అయితే వైఎస్ జగన్ నగరి పర్యటనకు వచ్చిన సమయంలో కేజే శాంతి, రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. కేజే శాంతి తిరస్కరించగా.. జగన్ మాత్రం ఒప్పుకోలేదు.. ఇద్దరి చేతులు కలిపారు. నగరి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. అయినా సరే ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో రోజా వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైంది.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధినేత జగన్, పార్టీ పెద్దల్ని కోరారు. ఆమెకు టికెట్ ఇస్తే నగరిలో వైఎస్సార్సీపీ ఓడిపోతుందని చెప్పారు.. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధిష్టానం పలువురు నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. కేజే కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ కనిపిస్తున్నారు.. అయితే గురువారం (సెప్టెంబర్ 12న) ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్ను కలిశారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేజే దంపతులు స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa