తిరుపతి లడ్డూ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. క్రమక్రమంగా పార్టీలన్నీ దీక్షలు, గుడుల బాట పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి నేతలు ఓ వైపు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం.. తమ హయాంలో ఎలాంటి తప్పూ జరగలేదని చెప్తోంది. టీటీడీ ముందు నుంచి అనుసరిస్తున్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించినట్లు చెప్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను సైతం 18 సార్లు వెనక్కి పంపామని.. ఆ పార్టీ వాదన. ఇదిలా ఉన్న సమయంలోనే తప్పును క్షమించు స్వామీ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అటు కూటమి నేతలు సైతం ఆలయాలను సందర్శిస్తూ, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధికార కూటమి నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు దీటుగా బదులిస్తున్న వైసీపీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని" వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అదే రోజు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ వెళ్లనున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ సైతం ధార్మిక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. 30వ తేదీ సాయంత్రం ఆలయాల్లో దీపారాధన చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఓం నమో నారాయణాయ మంత్రాన్ని దేవాలయాలు, ఇళ్లలో పఠించాలని పిలుపునిచ్చింది. అక్టోబర్ రెండున నగర సంకీర్తన కార్యక్రమాలు, అక్టోబర్ మూడో తేదీ ఆలయాల్లో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జనసేన పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల్లో జనసేన శ్రేణులతో పాటుగా.. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa