దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోంది. డిగ్రీలు, పీజీ పట్టాలు చేతులో పట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా యువత చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలు ఎన్ని జరిగినా కొందరు మాత్రం ఉద్యోగం మీద ఆశతో బ్రోకర్లను నమ్మి లక్షలకు లక్షలు చేతుల్లో పెట్టి మోసపోతున్నారు. అలాంటి ఘటనే తాజాగా బీహార్లో ఒకటి చోటు చేసుకుంది. ఓ యువకుడి దగ్గర ఏకంగా రూ.2 లక్షలు తీసుకుని ఐపీఎస్ ఉద్యోగం అంటూ బురిడీ కొట్టించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎస్ ఉద్యోగం అంటే మాటలు కాదు. ఏళ్లకేళ్లు కష్టపడి యూపీఎస్సీ పరీక్షల్లో పాస్ అయి ఇంటర్వ్యూ పాస్ అయితే తప్ప ఐపీఎస్ జాబ్ రాదు. కానీ బీహార్లోని ఓ యువకుడు మాత్రం 18 ఏళ్లకే ఐపీఎస్ జాబ్ కొట్టేశాడు. అయితే కష్టపడి కాదు రూ.2 లక్షలు చెల్లించి ఉద్యోగాన్ని పట్టించాడు. జాముయి జిల్లాకు చెందిన 18 ఏళ్ల మిత్లేష్ మాంఝీ అనే యువకుడు.. తన గ్రామంలో ఐపీఎస్ అని చెప్పుకుంటూ యూనిఫామ్, తుపాకీ ధరించి బైక్పై తిరుగుతున్నాడు. అయితే అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మిత్లేష్ మాంఝీని సికింద్రా స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తాను నెల రోజుల క్రితం ఓ వాటర్ ఫాల్స్ దగ్గరికి టూర్ కోసం వెళ్లగా అక్కడ మనోజ్ సింగ్ అనే వ్యక్తి కలిసినట్లు చెప్పాడు. రూ.2 లక్షలు ఇస్తే ఐపీఎస్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడని.. అతడికి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని తనను నమ్మించాడని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి.. వారి దగ్గరి నుంచి బలవంతంగా రూ.2 లక్షలు తీసుకువచ్చి మనోజ్ సింగ్కు ఇచ్చినట్లు వివరించాడు.
ఆ తర్వాత తనకు ఐపీఎస్ ఉద్యోగం వచ్చిందని చెప్పి.. యూనిఫామ్తో పాటు తుపాకీ కూడా ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో తాను ట్రైనీ ఐపీఎస్ అయ్యానని.. దగ్గర్లోని ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగినట్లు చెప్పాడు. ఇక ఈ నకిలీ ట్రైనీ ఐపీఎస్ అరెస్ట్ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. ఏకంగా ఐపీఎస్ ఉద్యోగం పేరుతోనే దందా నడిపే ముఠా కోసం బీహార్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు మిత్లేష్ మాంఝీని అరెస్ట్ చేసి తుపాకీ, యూనీఫామ్, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa