ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కరవు మండలాల జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఐదు జిల్లాల్లోని 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ఏపీ రెవెన్యూశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవు మండలాలుగా ప్రకటించారు. అయితే ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్ర కరవు.. మరో 27 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈ కరవు మండలాల్లో ప్రజలకు, రైతులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు జరుపుతున్నారు.
మరోవైపు కరవు మండలాల్లో వర్షపాతం, సాగు విస్తీర్ణం, తేమ వంటి అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. కరవు మండలాల్లో కరవు సహాయక చర్యలు చేపట్టడం సహా రుణాల మంజూరు చర్యలు తీసుకోనున్నారు. ఈ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ అందించనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి, నివేదికలు సమర్పించనున్నారు. అలాగే పంటకోత ప్రయోగాల ద్వారా నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేస్తారు.
ఎంతమొత్తంలో రైతులకు పెట్టుబడి రాయితీ అందించాలనే దానిపై నివేదికలు సమర్పిస్తారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అందించనుంది. అలాగే కరవు మండలాల్లోని రైతుల రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ, పశుగ్రాసం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి.
అలాగే కరవు ప్రభావిత మండలాల్లో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ మండలాల్లో అదనపు పనిదినాలు కల్పించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పనిదినాలను 150 రోజులకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అలాగే భూగర్భ జలాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోనున్నారు. కరవు మండలాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. వీటి నివేదిక తర్వాత కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa