కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని సుప్రీంకోర్టుకు ఎక్కిన వ్యక్తికి ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్పై నిషేధం విధించాలని ఆ వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వాట్సాప్ను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్.. సుప్రీంకోర్టును కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఆ పిల్ను తిరస్కరిస్తూ తుది తీర్పును వెలువరించింది. అంతకుముందు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పునే తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.
వాట్సాప్పై నిషేధం విధించాలంటూ కేరళకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్.. కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అయితే వాట్సాప్పై ఎందుకు నిషేధం విధించాలి అనేది కూడా వెల్లడించాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు-2021 ను వాట్సాప్ పాటించడం లేదని పిటిషనర్ ఆరోపించాడు. యూజర్ వైపు మార్పులు చేసే అవకాశం ఉందని.. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే మూలాలు కనుక్కోవడం కూడా సాధ్యం కాదని పేర్కొన్నాడు. అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత గోప్యతకు సంబంధించి యూరప్లో వాట్సాప్ ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోందని పేర్కొన్న పిటిషనర్.. భారత్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలను పాటించేందుకు వాట్సాప్ నిరాకరిస్తోందని తెలిపాడు.
అయితే పిటిషనర్ వాదనలను విన్న కేరళ హైకోర్టు.. ఇది తొందరపాటు చర్యగా పేర్కొంది. అంతేకాకుండా అతడు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ఇదే వ్యవహారంపై సదరు పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పౌరుల ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని ఆరోపించాడు. అంతేకాకుండా జాతీయ ప్రయోజనాలకు వాట్సాప్ ముప్పుగా మారిందని తెలిపాడు. టెక్నాలజీని మార్చుకోకుండా, ప్రభుత్వానికి సహకరించకుంటే దేశంలో వాట్సాప్ కార్యకలాపాలను నిషేధించాలని పేర్కొన్నాడు. ఇలాంటి అనేక వెబ్సైట్లు, మొబైల్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం.. కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa